కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లో తొమ్మిదో ఘటన
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో బుధవారం ఉదయం మరో చీతా చనిపోయింది.
భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో బుధవారం ఉదయం మరో చీతా చనిపోయింది. ధాత్రి అనే ఆడ చీతా మృతిచెందిందని అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత ఈ మరణానికి గల కారణం తెలుస్తుందని చెప్పారు. తాజాగా ధాత్రి మరణంతో.. గత ఐదు నెలల వ్యవధిలో చనిపోయిన చీతాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాలను మనదేశానికి రప్పించారు.
ఈ ఏడాది చివరికల్లా మొత్తం చీతాలను బహిరంగ ప్రదేశాల్లోకి విడిచిపెట్టాలని ప్రణాళిక రచించారు. అన్ని చీతాల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వాటికి రేడియో కాలర్స్ను కూడా అమర్చారు. ఇంతలోనే వరుసగా చీతాల మరణాలు సంభవిస్తున్నాయి. రేడియో కాలర్ వల్లే గాయాలై చీతాలు ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ఆరు చీతాల రేడియో కాలర్లను తొలగించారు. ఇకపై వాటి కదలికలను పసిగట్టేందుకు రేడియో కాలర్ బదులు డ్రోన్లను ఉపయోగించే అవకాశం ఉంది.