Punjab: పంజాబ్‌లో ఇంట్లోకి చొరబడి ఎన్‌ఆర్‌ఐపై కాల్పులు

పంజాబ్ లో ఇంట్లోకి చొరబడి ఎన్ఆర్ఐపై దుండగులు కాల్పులు జరిపారు. ఇద్దరు వ్యక్తులు సుఖ్ చైన్ సింగ్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు.

Update: 2024-08-24 10:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లో ఇంట్లోకి చొరబడి ఎన్ఆర్ఐపై దుండగులు కాల్పులు జరిపారు. అమృత్‌సర్ జిల్లాలోని డబుర్జి గ్రామంలో శనివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు సుఖ్ చైన్ సింగ్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. తల, మెడపై గాయాలపైన ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. అమెరికా నివాసి అయిన సుఖ్‌చైన్ సింగ్ నెల రోజుల క్రితం సొంతూరైన డబుర్జీ గ్రామానికి వచ్చాడు. హోటల్‌, లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆస్తితగాదాల వల్లే..

కాగా, శనివారం ఉదయం తలపాగా ధరించిన ఇద్దరు సాయుధ వ్యక్తులు బైక్‌పై సుఖ్‌చైన్ సింగ్ ఇంటిలోపలికి బలవంతంగా ప్రవేశించారు. గన్ చూపించి అతడితో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఉన్న పిల్లలు, అతడి భార్య ఏమీ చేయొద్దని దుండగులన కోరారు. అయితే, సుఖ్ చైన్ ని నిందితులు బలవంతంగా బెడ్ రూంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడంతో తల, మెడపై కాల్పులు జరిపి అక్కడ్నుంచి పారిపోయారు. ప్రస్తుతం సుఖ్ చైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే, బాధితుడికి అత్తమామలతో ఆస్తివివాదాలు ఉన్నాయి. ఆస్తి వివాదం వల్లే స్థానిక ముఠా అతడిపై కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Similar News