నీట్ వివాదంపై స్పందించిన జైరాం రమేశ్
నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ విరుచుకుపడ్డారు. నీట్ అంశంపై పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ విరుచుకుపడ్డారు. నీట్ అంశంపై పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుందనే విషయాన్ని బయటపెడతామన్నారు. అన్ని పరీక్షలను ఎన్టీఏ ప్రైవేట్ కంపెనీల ద్వారా నిర్వహిస్తోందన్నారు. ఎన్టీఏ తన విధులను ప్రైవేట్ కంపెనీలకు పనులు అప్పగించి.. చేతులు దులుపుకుంటుందని మండిపడ్డారు. స్కాంలు అసలు ఎలా జరుగుతున్నాయో చూడాలని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ల నుంచే ఈ స్కామ్లు బయటపడుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుబడతామని అన్నారు.
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
విద్యాశాఖ మంత్రి తొలుత పరీక్షల్లో అక్రమాలు లేవని అన్నారని గుర్తుచేశారు. ఆపై చిన్నపాటి తప్పులు జరిగాయని అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ, ఉన్నతస్ధాయి కమిటీ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నీట్, నెట్ వివాదాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే వ్యవస్థలన్నీ ఈ వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్టీఏ కూడా విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు నీట్ వ్యవహరంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని విపక్షాలు భగ్గుమన్నాయి.