'మోడీ డిగ్రీపై వ్యంగ్య వ్యాఖ్యల కేసులో స్టే ఇవ్వలేం.. అక్కడే తేల్చుకోండి'
ప్రధాని మోడీ డిగ్రీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసినందుకు గుజరాత్ వర్సిటీ వేసిన పరువునష్టం దావా కేసులో
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ డిగ్రీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసినందుకు గుజరాత్ వర్సిటీ వేసిన పరువునష్టం దావా కేసులో తనపై చర్యలు తీసుకోకుండా విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ఎదుట పెండింగ్లో ఉన్నందున, తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. దీనిపై కేజ్రీవాల్, గుజరాత్ యూనివర్సిటీ తమ వినతులను గుజరాత్ హైకోర్టుకు సమర్పించుకోవచ్చని సూచించింది.
ఈ కేసులో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాకుండా.. ఆ సమన్లపై స్టే ఇవ్వాలని సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టులలో వరుసగా పిటిషన్లు వేసినా ఫలితం దక్కలేదు. తాజాగా శుక్రవారం రోజు సుప్రీంకోర్టులోనూ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు.