మా ప్రభుత్వం అధికారంలో వస్తుందని చెప్పలేను కానీ.. మీకు మంత్రిపదవి మాత్రం ఖాయం

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను ఉద్దేశించి చేసిన సరదా కామెంట్లు వైరల్ గా మారాయి.

Update: 2024-09-23 07:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను ఉద్దేశించి చేసిన సరదా కామెంట్లు వైరల్ గా మారాయి. ‘‘మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, లేదో చెప్పలేం కానీ.. రాందాస్‌ అథవాలే మాత్రం కచ్చితంగా మంత్రి అవుతారన్న గ్యారంటీ ఉంది.’’ అని గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. అక్కడున్నవారందరూ ఆ సరదా వ్యాఖ్యలకు నవ్వులతో జవాబిచ్చారు. అప్పుడు ఆ వేదికపై అథవాలే కూడా ఉన్నారు. వేదికపై ఉన్న అథవాలేతో సరదాగా నవ్వుతూ.. "కేవలం జోక్ చేశాను" అని గడ్కరీ స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) నాయకుడైన అథవాలే మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మరోసారి మంత్రిపదవి దక్కుతుందని అన్నారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో ఆర్‌పీఐ కూడా భాగం. కాగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని అథవాలే అన్నారు. మరోవైపు, అజిత్ పవార్ పార్టీని మహాయుతి కూటమిలో చేర్చుకోవడంతో.. తమ పార్టీకి క్యాబినెట్‌ పదవులు, రెండు కార్పొరేషన్ల చైర్మన్‌లు, జిల్లా స్థాయి కమిటీల్లో చేర్చుకుంటామన్న హామీ జరిగలేదన్నారు. ఇకపోతే, 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అథవాలే పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ పడనుంది.


Similar News