Nepal Floods: నేపాల్ లో వరదల బీభత్సం.. 112 మంది మృతి

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల వల్ల ఇప్పటివరకు 112 మంది మృతి చెందినట్లు నేపాల్ భద్రతా బలగాలు తెలిపాయి.

Update: 2024-09-29 04:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల వల్ల ఇప్పటివరకు 112 మంది మృతి చెందినట్లు నేపాల్ భద్రతా బలగాలు తెలిపాయి. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్ వ్యాప్తంగా మొత్తం 79 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. 3,000 మందికి పైగా ప్రజలను రక్షించామన్నారు. దేశవ్యాప్తంగా 63 ప్రాంతాల్లో ప్రధాన రహదారులను బ్లాక్ అయినట్లు వెల్లడించారు. ఖాట్మండులో 226 ఇళ్లు నీటమునిగిపోయాయని, నేపాల్ పోలీసుల నుంచి దాదాపు 3,000 మంది భద్రతా సిబ్బందిని బాధిత ప్రాంతాల్లో మోహరించినట్లు పోలీసులు నివేదించారు.

వరదల బీభత్సం

ఇకపోతే, గత కొన్ని రోజులుగా నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది. వరద బాధితులను సహాయక దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదల ప్రభావం బిహార్‌పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి కొన్ని నదులు బిహార్‌లోకి ప్రవహిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదల గురించి విపత్తు అధికారులు హెచ్చరించారు. రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు తాత్కాలిక ప్రధాన మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ మాన్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. నేపాల్‌లోని అన్ని పాఠశాలలను మూడ్రోజుల పాటు మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని పరీక్షలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరదల వల్ల ప్రధాన ట్రాన్స్ మిషన్ లైన్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఖాట్మండులో రోజంతా విద్యుత్ నిలిచిపోయింది.


Similar News