S Jaishankar On Bangladesh Ties: బంగ్లాతో సంబంధాలపై జైశంకర్ ఏమన్నారంటే?

బంగ్లాదేశ్‌ (Bangladesh)తో భారత్ కున్న సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. బంగ్లాతో మునుపటిలానే స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Update: 2024-09-17 09:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ (Bangladesh)తో భారత్ కున్న సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. బంగ్లాతో మునుపటిలానే స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. దానివల్లే ఇరు దేశాలకు మేలు జరుగుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బంగ్లాలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాల గురించి అడిగిన ప్రశ్నపై ఆయయన స్పందించారు. ‘‘బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో ఏం జరిగినా అది వారి అంతర్గత వ్యవహారం. పొరుగుదేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండడం అవసరం. భారత్‌ పొరుగుదేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తోంది. బంగ్లాతో స్నేహపూర్వక బంధాన్ని అలానే ఉంచాలనుకుంటున్నాం. వాణిజ్యపరంగా బంగ్లాతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీన్ని ఇలాగే ముందుకుతీసుకెళ్లాలని అనుకుంటున్నాం’’ అని జై శంకర్‌ పేర్కొన్నారు.

బంగ్లాలో ఉద్రిక్తతలు

కాగా.. రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే షేక్ హసీనాపై యూనస్ కామెంట్లు చేశారు. భారత్‌లో ఉన్న హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరేవరకు హసీనా మౌనంగా ఉండాలన్నారు. లేకపోతే ఆమె వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. భారత్‌తో తమ దేశం సత్సంబంధాలను కోరుకుంటోందని పేర్కొన్నారు. దీనిపైనే మీడియా అడిగి ప్రశ్నకు జైశంకర్ స్పందించారు. బంగ్లాతో సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు.


Similar News