Naxalism: త్వరలోనే నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది: ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి
నక్సలిజం త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: నక్సలిజం త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజంతో తీవ్రంగా పోరాడుతున్నామని కాబట్టి దానిని అంతమొందిస్తామని చెప్పారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో 9 మంది నక్సల్స్ను హతమార్చడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులను అభినందించారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మావోయిజాన్ని నిర్మూలించే వరకు ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా దళాలకు ఇది చాలా పెద్ద విజయమని కొనియాడారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ మాట్లాడుతూ.. బస్తర్ మొత్తం శాంతి, అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు. తాజా ఘటనతో ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు కాల్చి చంపిన నక్సలైట్ల సంఖ్య 154కు చేరుకుందని వెల్లడించారు.