Manipur: మణిపూర్లో ఆగని హింస.. ఇళ్లు, బస్సులకు నిప్పు
మణిపూర్లో హింసాకాండ ఆగడం లేదు.
ఇంఫాల్ : మణిపూర్లో హింసాకాండ ఆగడం లేదు. మయన్మార్ బార్డర్లోని మోరే జిల్లాలో ఉన్న మోరే బజార్ ప్రాంతంలో పలు ఇళ్లకు దుండగులు బుధవారం తెల్లవారుజామున నిప్పుపెట్టారు. అయితే ఆ ఇళ్లలో ఎవరూ ఉండట్లేదని తెలిసింది. మంగళవారం రాత్రి కాంగ్పోక్పి జిల్లాలోని సపోర్మీనా వద్ద భద్రతా బలగాలు రవాణా కోసం వినియోగించే రెండు బస్సులకు మూకలు నిప్పు పెట్టారు. ఆ బస్సులు దిమాపుర్ వైపు నుంచి వస్తుండగా అల్లరి మూకలు అడ్డుకొని.. వాటిలోకి ఎక్కి ఇతర తెగ ప్రజలెవరైనా అందులో ఉన్నారా అని అడిగారు.
ఆ తరువాత వాటిని దహనం చేశారని అధికారులు చెప్పారు. ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టం జరగలేదు. మొబైల్ రీఛార్జ్, ఎల్పీజీ సిలిండర్ బుకింగ్, కరెంటు బిల్లుల చెల్లింపు, ఆఫీసుల కార్యకలాపాలు, వర్క్ ఫ్రం హోం వారిపై ఇంటర్నెట్ నిషేధం ప్రభావం చూపుతున్న కారణంగా కొన్ని షరతులతో మణిపూర్లో బ్రాడ్బ్యాండ్ సేవలను హోంశాఖ మంగళవారం నుంచి పునరుద్ధరించింది.