Manipur: మైతీ, కుకీ ఎమ్మెల్యేల భేటీ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సమావేశం

మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మైతీ, కుకీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Update: 2024-10-14 10:57 GMT

 దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన మైతీ, కుకీ, నాగా ఎమ్మెల్యేలతో సంయుక్తంగా ఢిల్లీలో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ భేటీకి అమిత్ షా సైతం హాజరుకానున్నట్టు సమాచారం. ఈ మీటింగ్ నిమిత్తం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. సమావేశానికి ఎంత మంది ఎమ్మెల్యేలు హాజరవుతారనే విషయం వెల్లడించలేదు. కానీ అన్ని వర్గాల ఎమ్మెల్యేలు మీటింగ్‌లో పాల్గొననున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా, అల్లర్ల తర్వాత శాసనసభ్యులు సమావేశమవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

నాగా ఎమ్మెల్యేలు గత పది నెలలుగా కోల్‌కతా, గువహటి వంటి ప్రాంతాల్లో మైతీ, కుకీ ఎమ్మెల్యేలను విడివిడిగా కలిసి చర్చించారు. వారి పరస్పర అంగీకారంతోనే సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. కాగా, గతేడాది మే 3 నుంచి మైతీ, కుకీ వర్గాల మధ్య జాతి హింస నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో సుమారు 250 మంది మరణించగా.. 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అల్లర్లు అదుపులోకి రాలేదు. అయితే తాజాగా జరిగే చర్చలు అల్లర్లు అదుపులోకి తెచ్చేందుకు దోహదపడతాయని పలువురు భావిస్తున్నారు.

Similar News