Manipur: మణిపూర్లో భూ వివాదం.. ఇరు వర్గాల ఘర్షణలో ముగ్గురు మృతి!
మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఓ భూమి విషయమై వివాదం నెలకొనగా ఇరు వర్గాల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఓ భూమి విషయమై వివాదం నెలకొంది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇరువురు నాగా వర్గానికి చెందినవారే అయినా హున్ఫున్, హాంగ్పంగ్ అనే రెండు వేర్వేరు గ్రామాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రెండు గ్రామాల నివాసితులు బుధవారం ఒక స్థలాన్ని శుభ్రం చేస్తుండగా ఈ ఘర్షణ జరిగినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్తో పాటు భారీగా రాష్ట్ర పోలీసులను మోహరించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిషేధం విధించారు. కాగా, ఇప్పటికే కుకీ, మైతీ తెగల మధ్య ఘర్షణలో అట్టుడుకుతున్న రాష్ట్రంలో భూ వివాదం కారణంగా ముగ్గురు మృతి చెందటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.