మణిపూర్ సీఎంను వెంటనే తొలగించాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

మణిపూర్‌లో హింసను నియంత్రించడంలో విఫలమైన సీఎం బిరేన్ సింగ్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే డిమాండ్ చేశారు.

Update: 2024-09-09 11:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో హింసను నియంత్రించడంలో విఫలమైన సీఎం బిరేన్ సింగ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న భద్రతా పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మణిపూర్ విచారణ కమిషన్ తన విచారణను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అంతేగాక మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులను తగ్గించడంలో మోడీ వైఫల్యం క్షమించరానిదని ఆరోపించారు. ‘గత 16 నెలల్లో ప్రధాని మోడీ ఒక్క సెకను కూడా మణిపూర్‌లో ఉండలేదు. రాష్ట్రంలో హింస కొనసాగుతోంది. మోడీ, అమిత్ షాల పని తీరును ప్రజలు గమనిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి వలెనే, కేంద్ర హోంమంత్రి కూడా మణిపూర్‌లో భద్రత కల్పించే తన రాజ్యాంగ బాధ్యతను వదులుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎన్నికల ప్రసంగాల్లో ఆయన బిజీగా ఉన్నారని విమర్శించారు. మణిపూర్‌లో డ్రోన్, రాకెట్ ఆధారిత గ్రెనేడ్ దాడులు ప్రారంభమయ్యాయని, ఇది ఇప్పుడు దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నదని హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో బీజేపీ రాజీనామా డ్రామా ఆడుతుందని తెలిపారు. రాష్ట్ర బలగాల సహాయంతో అన్ని రకాల తిరుగుబాటు గ్రూపులపై భారీ అణిచివేత జరగాలని సూచించారు.


Similar News