Maharashtra: లాతూర్ లో 50 మంది విద్యార్థులకు అస్వస్థత

మహారాష్ట్రలోని లాతూర్‌లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులు అనారోగ్యం బారినపడ్డారు.

Update: 2024-10-06 11:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని లాతూర్‌లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులు అనారోగ్యం బారినపడ్డారు. ఇక్కడి పురంమల్ లాహోటీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిన్న 50 మంది విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి 8.30 గంటల సమయానికి పలువురికి వికారంగా అనిపించిందని, మరికొందరు విద్యార్థులకు వాంతులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న కళాశాల ప్రిన్సిపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని లాతూర్‌లోని విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆసుపత్రి డీన్ డాక్టర్ ఉదయ్ మోహితేకు సమాచారం అందించారు. బాధిత విద్యార్థులను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. శనివారం అర్ధరాత్రి దాదాపు 50 మంది విద్యార్థులు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారని డాక్టర్ మోహితే తెలిపారు. వీరిలో 20 మందిని ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు. మరో 30 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

శివాజీనగర్ పోలీసులకు సమాచారం

ఈ ఘటనపై శివాజీనగర్ పోలీసులకు సమాచారం అందించామని కళాశాల ప్రిన్సిపాల్ వీడీ నిత్నావేర్ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆహార నమూనాలను సేకరించారు. శాంపిల్స్ రిపోర్టు వచ్చిన తర్వాత ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలను నిర్ధారిస్తామని చెప్పారు. ఘటనపై సమాచారం అందుకున్న లాతూర్‌ కాంగ్రెస్ ఎంపీ శివాజీ కల్గే ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు.లాతూర్ కలెక్టర్ ని కూడా సంప్రదించి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


Similar News