Train derailment: ఉత్తరాఖండ్ లో రైలు ప్రమాదానికి కుట్ర
దక్షిణ భారతంలో మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో రైలుపట్టాలపై ఎల్పీజీ సిలిండర్ లభ్యమైంది.
దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ భారతంలో మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో రైలుపట్టాలపై ఎల్పీజీ సిలిండర్ లభ్యమైంది. గూడ్స్ రైలు లోకోపైలట్ సిలిండర్ ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ఈ ఘటనపై లోకోపైలట్ అధికారులకు సమాచారమందించారు. ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు ఉపాధ్యాయ్ ఈ ఘటనపై స్పందించారు. ధంధేరా నుండి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లాండౌరా స్టేషన్ దగ్గర ఆదివారం ఉదయం 6:35 గంటలకు ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఘటనా స్థలానికి ఒక పాయింట్మెన్ను పంపించి సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించామన్నారు. అప్పటి నుండి రైలు ధంధేరా వద్ద స్టేషన్ మాస్టర్ కస్టడీలో ఉంచామన్నారు. స్థానిక పోలీసులు, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP)లకు సమాచారం అందజేశామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలకు కుట్ర
ఇకపోతే, దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలకు కుట్రలు జరుగుతున్నాయి. అగస్టు నుంచే ఇలాంటివి దాదాపు 18 ఘటనలు జరిగినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. ఇటీవలే, కాన్పూర్లోని రైల్వే ట్రాక్పై మరో ఎల్పీజీ సిలిండర్ దొరికింది. జూన్ 2023 నుండి రైళ్లను పట్టాలు తప్పించే ప్రయత్నంలో ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంటు దిమ్మెలతో సహా వివిధ వస్తువులను ట్రాక్లపై ఉంచిన 24 ఘటనలు జరిగాయి. వీటిలో 15 ఘటనలు ఆగస్టులో జరిగాయి. మరో ఐదు సెప్టెంబర్లో జరిగాయి. దీంతో, రైల్వే భద్రతపై ఆందోళన పెరుగుతోంది.