Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్యకు కారణం స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టేనా?
బాంద్రా మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య సంచలనంగా మారింది.
దిశ, నేషనల్ బ్యూరో: బాంద్రా మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య సంచలనంగా మారింది. శనివారం రాత్రి తన కుమారుడి కార్యాలయం ఎదుట క్రాకర్స్ కాలుస్తున్న టైంలో ఇద్దరు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీ చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే, బాబా సిద్ధిఖీకి ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయంలో వ్యాపార విభేదాలున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిలో అవకతవకల కారణంగానే ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుగుతోంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. హంతకులు చాలా ముందుగానే ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు తేలింది. నిందితులకు ముందే చెల్లింపులు జరిపినట్లు సమాచారం. మరోవైపు ఆయుధాలు పార్శిల్లో వచ్చినట్లు తెలుస్తోంది. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే, ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కూడా ఈ కేసు దర్యాప్తు కోసం ముంబై వస్తోంది.
మనీలాండరింగ్ కేసు
మనీలాండరింగ్ కేసులో 2018లో ఈడీ బాబా సిద్ధిఖీకి చెందిన రూ.462 కోట్ల ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. ఆయన 2000-2004 వరకు మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా ఉన్నారు. అప్పుడు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు చేపట్టారు. ఇళ్లస్థలాల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు 2012లో అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైదం. దీనిలో 2 వేల కోట్ల స్కాం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2014లో సిద్ధిఖీ సహా 150 మందిపై కేసు నమోదైంది. బాబా సిద్ధిఖీ అసలు జియా ఉద్దీనన్ సిద్ధిఖీ. ఆయన 1977లో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో చేరారు. చాలా వేగంగా వివిధ పదవులు చేపట్టి.. 1980 నాటికి బాంద్రా తాలుకాలో కీలక నేతగా మారారు. 1999లో తొలిసారి బాంద్రా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మూడు సార్లు అసెంబ్లీకి వెళ్లారు. మహారాష్ట్ర కార్మిక, ఫుడ్ సివిల్ సప్లయిస్, లేబర్, ఎఫ్డీఏ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత సడెన్ గా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు.
బాలీవుడ్ తో సంబంధాలు
బాబా సిద్ధిఖీ నటుడు సునీల్ దత్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారారు. ఆ విధంగా బాలీవుడ్లో కూడా బలమైన సంబంధాలు నెరిపారు. బాబా సిద్ధిఖీ రంజాన్ సమయంలో ఇచ్చే ఇఫ్తార్ విందులు బాలీవుడ్లో బాగా పాపులర్. వీటికి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సహా ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి ఓ పార్టీలోనే సల్మాన్, షారుఖ్ మధ్య కోల్డ్ వార్ కి సిద్ధిఖీ ముగింపి పలికినట్లు తెలుస్తోంది.