Jammu Kashmir: జమ్ముకశ్మీర్ లో ఇద్దరు జవాన్ల కిడ్నాప్ కలకలం
జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఆర్మీ జవాన్ల కిడ్నాప్ కలకలం రేపింది. ఉగ్రవాదులు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేసిన ఘటన సంచలనంగా మారింది.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఆర్మీ జవాన్ల కిడ్నాప్ కలకలం రేపింది. ఉగ్రవాదులు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేసిన ఘటన సంచలనంగా మారింది. కాగా.. ఉగ్రవాదుల చెర నుంచి ఒక జవాన్ తప్పించుకుని బయటపడగా.. మరో జవాన్ మాత్రం వారి వద్దే చిక్కుకుపోయాడు. ముష్కరుల చెర నుంచి బయటపడిన సైనికుడికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. గాయపడిన జవాన్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మరో జవాన్ కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా.. అనంతనాగ్ లోని పత్రిబల్ అటవీ ప్రాంతం నుంచి కిడ్నాప్ నకు గురైన హిలాల్ అహ్మద్ భట్ డెడ్ బాడీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్ ఫలితాలు వెలువడిన ఒకరోజు తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.
జవాన్ల కిడ్నాప్
అక్టోబర్ 8న ప్రారంభించిన జాయింట్ యాంటీ టెర్రర్ ఆపరేషన్లో టెరిటోరియల్ ఆర్మీ 161 యూనిట్కు చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్లోని అటవీ ప్రాంతం నుండి కిడ్నాప్ నకు గురయ్యారు. కిడ్నాప్కు గురైన టీఏ జవాన్ను అనంత్నాగ్ జిల్లా ముక్దంపోరా నౌగామ్లో నివాసం ఉంటున్న హిలాల్ అహ్మద్ భట్ 162 యూనిట్ టీఏగా గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫయాజ్ అహ్మద్ షేక్ అనే మరో జవాన్ తప్పించుకోగలిగాడు కానీ గాయపడ్డాడు. అతని భుజం, ఎడమ కాలికి గాయాలయ్యాయి. చికిత్స కోసం 92 బేస్ హాస్పిటల్ శ్రీనగర్కు తరలించారు. ఇకపోతే, ఆ ప్రాంతంలో ఆర్మీ భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. కాగా.. సైనికులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ గాలిస్తుంది.