Kolkata: డాక్టర్లను చర్చలకు పిలిచన బెంగాల్ ప్రభుత్వం

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.

Update: 2024-10-14 08:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. కాగా.. వారికి సంఘీభావం తెలుపుతున్న ద ఫెడరేషన్‌ ఆఫ్ ఆల్‌ఇండియా మెడికల్ అసోసియేషన్‌(FAIMA) పెన్‌డౌన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. బెంగాల్‌ ప్రభుత్వం చర్చలకు పిలవడంతో పెన్‌డౌన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేస్తామని ఫెమా తొలుత ప్రకటించింది. అయితే, ఈవిషయంపై బెంగాల్‌ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. దీంతో, పశ్చిమబెంగాల్‌ జూనియర్‌ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చిస్తామని వెల్లడించింది. అక్కడ సానుకూల స్పందన రాకపోతే, అక్టోబర్ 15 నుంచి సమ్మెను కొనసాగిస్తామంది. ‘‘ప్రభుత్వంతో జూనియర్‌ డాక్టర్ల చర్చలు ఫలించకపోవడంతో.. జాతీయస్థాయిలో కలిసికట్టుగా పోరాడాలని మేం ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి గతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పాం. అయినప్పటికీ సంతృప్తికరమైన చర్యలేమీ కన్పించలేదు. అందుకే పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చాం. ఇప్పుడు చర్చల్లో పాల్గొన్న తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటో వెల్లడిస్తాం’’ అని ఫెమా పేర్కొంది.

జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష

జూనియర్‌ వైద్యుల డిమాండ్లపై చర్చించేందుకు బెంగాల్ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం స్వస్థ్‌ భవన్‌లో సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఫెమా ప్రతినిధులు హాజరుకావాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ ఆహ్వానించారు. జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్షను విరమించేలా సీనియర్‌ డాక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకపోతే, హత్యాచార ఘటన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జూనియర్‌ వైద్యులలో పలువురి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లుగా సీనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన పులస్త ఆచార్య అనే డాక్టర్ తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో ఆదివారం రాత్రి అతడిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నామన్నారు. సిలిగురిలో నిరశన దీక్ష చేస్తున్న మరో ముగ్గురి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. డిమాండ్లు నెరవేర్చేవరకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరాహార దీక్ష వీడేది లేదని డాక్టర్లు చెబుతున్నారు.

Similar News