Covid 19 : రూ.7,223.64 కోట్ల ‘కరోనా స్కాం’పై ‘సిట్’ విచారణ.. కీలక ఆదేశాలు

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-10-10 13:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత బీజేపీ హయాంలో కరోనా మహమ్మారి కట్టడి చర్యల కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఆరోపించింది. రాష్ట్రంలో కొవిడ్-19 ప్రబలిన సమయంలో జరిగిన దాదాపు రూ.7,223.64 కోట్లు విలువైన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్)తో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కాం జరిగిన సమయంలో బీజేపీ సీనియర్ నేత, బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపింది. కరోనా కాలంలో బీజేపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ జాన్ మైఖేల్ డీ కున్హా సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఉపకమిటీ ఇటీవలే రాష్ట్ర సర్కారుకు మధ్యంతర నివేదికను అందించింది.

గురువారం జరిగిన కర్ణాటక మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించి, సిట్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో వైద్యపరికరాలు, మాస్క్‌లు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, పీపీఈ కిట్ల కొనుగోలులో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఉప కమిటీ నివేదించింది. కనీసం ప్రభుత్వ ఆమోదం లేనిదే కొన్ని కొనుగోళ్లు జరిగాయని పేర్కొంది. చివరకు కరోనా మరణాల గణాంకాల్లోనూ ఇష్టానుసారంగా మార్పులు, చేర్పులు చేశారని ఉప కమిటీ గుర్తించింది. ఈ అక్రమాలలో భాగస్తులుగా ఉన్న అధికారులు, కీలకమైన వ్యక్తులను గుర్తించడంపై సిట్ ఫోకస్ పెట్టనుంది. ఉప కమిటీ నివేదికపై కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ స్పందిస్తూ.. ‘‘కరోనా స్కాంలో కనీసం రూ.500 కోట్లను రికవరీ చేయాల్సి ఉంటుందని మాకు నివేదిక అందింది’’ అని చెప్పారు. ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించి రాష్ట్ర అకౌంట్స్ - ఆడిటింగ్ విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారిని సస్పెండ్ చేశారు. కొవిడ్-19 కాలంలో జరిగిన ప్రభుత్వ వైద్య సంబంధిత కొనుగోళ్ల అవకతవకల్లో ఆయన పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.


Similar News