Kangana Ranaut: ఆ చట్టాలు మళ్లీ తేవాలి.. బీజేపీని ఇరుకున పెట్టేలా కంగనా రనౌత్ వ్యాఖ్యలు

హర్యానా ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

Update: 2024-09-24 11:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రయత్నించి వెనక్కి తీసుకున్న 3 వ్యవసాయ చట్టాలని తిరిగి తేవాల్సిందేనన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. దేశాభివృద్ధిలో రైతులది కీలక పాత్ర అని, వారి అభివృద్ధి కోసం రద్దు చేసిన ఆ మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేయాల్సిందేనన్నారు.

బీజేపీకి తలనొప్పిగా కంగనా: 

కంగనా రనౌత్ వరుస వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పి వ్యవహారంగా మారుతున్నది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం గతంలో రైతులు చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుకోకపోయి ఉంటే ఇండియా మరో బంగ్లాదేశ్ అయి ఉండేదంటూ గత నెలలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో పార్టీ డ్యామేజీ కాకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కంగనా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అంటూ గతంలో బీజేపీ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారం మరిచిపోకముందే ఓ వైపు హర్యానాకు అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు చట్టాలను తిరిగి వెనక్కి తీసుకురావాలని ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతుల ఆందోళనలతో కేంద్రం వెనక్కి తగ్గి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు కోరి వెనక్కి తీసుకున్నారు. ఆ రైతు ఉద్యమంలో పెద్ద ఎత్తున హర్యానా రైతులు పాల్గొన్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం తమపై కర్కషంగా వ్యవహరించిందని రైతు సంఘాలు ఆగ్రహంతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హర్యానాలో పార్టీని గెలిపించుకునేందుకు బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంటే కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కారిడార్ లో దుమారం గా మారాయి. ఇదిలా ఉంటే గతంలో రైతు చట్టాలను సమర్థించినందుకు గాను ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.


Similar News