Emergency Movie: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కు బెదిరింపులు

బీజేపీ ఎంపీ, న‌టి కంగ‌నా ర‌నౌత్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. ఆమెను చంపేస్తామంటూ కొంద‌రు ఓ వీడియోని రిలీజ్ చేశారు.

Update: 2024-08-27 07:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఎంపీ, న‌టి కంగ‌నా ర‌నౌత్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. ఆమెను చంపేస్తామంటూ కొంద‌రు ఓ వీడియోని రిలీజ్ చేశారు. దీనిపై, కంగనా పోలీసులను ఆశ్రయించారు. ఆ వీడియోను మ‌హారాష్ట్ర డీజీపీకి పోస్టు చేస్తూ త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆమె కోరారు. సోషల్ మీడియా ఎక్స్ లో ఆ వీడియోను పోస్టు చేసిన కంగనా.. దయచేసి దీన్ని పరిశీలించండి అని మహారాష్ట్ర డీజీపీని, హిమాచల్ పోలీసులు, పంజాబ్ పోలీసులను ట్యాగ్ చేశారు. కంగనా న‌టించిన ఎమ‌ర్జెన్సీ మూవీ త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్న‌ది. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. అందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు. దీనిపైనే ఆమెకు బెదిరింపులు వచ్చాయి.

సినిమా రిలీజ్ కావద్దని బెదిరింపులు

కంగ‌నాను ఓ రూమ్‌లో కూర్చుని ఉన్న వ్యక్తులు బెదిరిస్తూ వీడియో పంపారు. ఇద్ద‌రు మాత్రం నిహంగ్ సిక్కుల త‌ర‌హాలో దుస్తులు ధరించారు. ‘ఒక‌వేళ ఆ సినిమా రిలీజైతే సిక్కు సమాజం దాన్ని ఖండిస్తుంది. మీ సినిమాను చెప్పుల‌తో కొడుతాం’ అని ఆ వీడియోలో ఓ వ్య‌క్తి హెచ్చ‌రిక‌లు చేశాడు. ‘ఒక‌వేళ మూవీలో అతడిని (ఖ‌లిస్థానీ నేత జ‌ర్నైల్ సింగ్ భింద్రన్ వాలేను ఉద్దేశిస్తూ) ఉగ్ర‌వాదిగా చిత్రీక‌రిస్తే ఊరుకోబోం. మీరు ఎవరి సినిమా చేస్తున్నారో ఆమెకు(ఇందిరాగాంధీకి) ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి.’ అని భింద్రన్ వాలేను కొనియాడుతూ విక్కీ థామస్ అనే వ్యక్తి వార్నింగ్ ఇచ్చారు. ఇందిర‌ను హ‌త్య చేసిన బాడీగార్డులు స‌త్వంత్ సింగ్‌, బియాంత్ సింగ్ గురించి కూడా ఆ వీడియోలో ప్రస్తావించాడు. దీంతో, బెదిరింపుల వీడియోను షేర్ చేస్తూ.. మ‌హారాష్ట్ర, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ పోలీసుల‌కు న‌టి కంగ‌నా ఫిర్యాదు చేశారు.


Similar News