Jharkhand Minister: జార్ఖండ్‌లో ఈడీ దాడులు.. జల్ జీవన్ మిషన్ కేసులో చర్యలు

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జార్ఖండ్‌లో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం రేపాయి.

Update: 2024-10-14 10:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జార్ఖండ్‌లో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం రేపాయి. రాజధాని రాంచీ సహా 20 ప్రాంతాల్లో ఈడీ సోమవారం దాడులు చేపట్టింది. రాష్ట్ర మంత్రి మిథిలేష్‌ ఠాకూర్‌ పీఏ హరేంద్ర సింగ్‌, మంత్రి సోదరుడు ఐఏఎస్‌ అధికారి మనీష్‌ రంజన్‌, వ్యాపారవేత్త విజయ్‌ అగర్వాల్‌తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల ఇళ్లపై తనిఖీలు చేసింది. జల్-జీవన్ మిషన్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

ఈ దాడుల్లో పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. జార్ఖండ్‌లోని పలు జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ అమలులో జాప్యం జరిగిందని ఆరోపణలున్నాయి. దీంతో అనేక ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో టెండర్ల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మంత్రి అలంగీర్ ఆలం ఇప్పటికే జైలులో ఉన్నారు. ఈ ఏడాది మే 15న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఈ నెల 8న కూడా ఈడీ పలు చోట్ల దాడులు చేసింది. రాజధాని రాంచీ, కోల్ సిటీ ధన్‌బాద్‌లో తనిఖీలు చేపట్టింది.

కాగా, సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో మిథిలేష్ ఠాకూర్ కీలక వ్యక్తిగా ఉన్నారు. ఈడీ సోదాలు ముమ్మరం కావడంతో మిథిలేష్‌పై విచారణ సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే త్వరలో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూ్ల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈడీ దాడులు ముమ్మరం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 

Similar News