కేరళలో లోయలోపడ్డ జీపు..
కేరళలోని వయనాడ్ జిల్లాలో శుక్రవారం జీపు ప్రమాదం చోటు చేసుకుంది.
కేరళ: కేరళలోని వయనాడ్ జిల్లాలో శుక్రవారం జీపు ప్రమాదం చోటు చేసుకుంది. మహిళా కూలీలతో ప్రయాణిస్తున్న జీపు లోయలో పడటంతో ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. వలాద్-మనంతవాడి రహదారిలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఆ టైమ్లో జీపులో 12 మంది ఉన్నారు. ఓ ప్రైవేట్ టీ ఎస్టేట్లో పనిచేసే మహిళలు ఈ జీపులో మక్కిమలకు తిరిగొస్తున్నట్లు స్థానికులు మీడియాకు తెలిపారు.
బాధితులను మనంతవాడిలోని ఆస్పత్రికి తరలించగా వారిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే, కోజికోడ్లో ఉన్న అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్ను ప్రమాద స్థలానికి చేరుకోవాలని సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స సహా అవసరమైన ఇతర పనులను చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు సీఎంఓ ప్రకటనలో పేర్కొంది.