Jdu party: జేడీయూ కీలక నిర్ణయం.. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు మద్దతు
బిహార్ సీఎం నితీశ్ కుమార్కు చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు మద్దతిచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం నితీశ్ కుమార్కు చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు మద్దతిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ సమగ్రాభివృద్ధికి ఒకే దేశం ఒకే ఎన్నిక ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీగా ప్రజా ధనం వృథా అవుతోందని, దీనివల్ల దేశ ప్రగతికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అంతేగాక దేశం స్థిరమైన విధానాలు తీసుకోకపోవడమే గాక, నూతన సంస్కరణలపై దృష్టి సారించలేక పోతోందని వెల్లడించారు. కాబట్టి ఎన్డీఏ తీసుకొచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు జేడీయూ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఏకకాల ఎన్నికల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జేడీయూ మద్దతివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, జేడీయూ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.