హైదరాబాద్ : దేశ విభజన ఒక చారిత్రక తప్పిదమని, దీనిపై తాను ఒక్క లైన్లో సమాధానం చెప్పలేనని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ చారిత్రక తప్పిదానికి దేశ విభజన సమయం నాటి నాయకులే కారకులని ఆరోపించారు. తాను చేస్తున్న కామెంట్స్ పై క్లారిటీ రావాలంటే.. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించిన ‘ఇండియా విన్స్ ఫ్రీడం’ పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. ‘‘దేశాన్ని విభజించవద్దని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అప్పటి కాంగ్రెస్ నేతలను కలిసి వేడుకున్నారు.
ఇస్లాం మతపెద్దలు కూడా రెండు దేశాల సిద్ధాంతాన్ని అప్పట్లో వ్యతిరేకించారు’’ అని ఒవైసీ పేర్కొన్నారు. దేశ విభజన దురదృష్టకరమని, అది జరగకుండా ఉండాల్సిందన్నారు. దేశ విభజన జరగడానికి ఆ సమయంలో ఉన్న నాయకులు అందరూ బాధ్యులే అని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.