ప్రముఖ గణాంక శాస్త్రవేత్త సీఆర్ రావు కన్నుమూత..
ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు (సీఆర్ రావు) కన్నుమూశారు.
వాషింగ్టన్: ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు (సీఆర్ రావు) కన్నుమూశారు. 102 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంతో బుధవారం ఉదయం అమెరికాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన 2020 సెప్టెంబరు 10న వందో పుట్టినరోజు జరుపుకొన్నారు. గణాంక రంగంలో విప్లవాత్మక ఆలోచనలకు బీజం వేసినందుకు గానూ "ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023" అవార్డును ఈ ఏడాదే సీఆర్ రావు అందు కున్నారు. 1945లో కోల్కతా మేథమేటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధనా పత్రానికిగానూ ఈ అవార్డు దక్కింది.
భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్తో సత్కరించింది. ఎన్ఎస్ భట్నాగర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న సీఆర్ రావు ఇప్పటివరకూ 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం అందుకున్నారు.
బళ్లారి జిల్లా హడగళిలో..
సీఆర్ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో ఆయన బాల్యం గడిచింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్గా ఎదిగారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన.. యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్గా సేవలందించారు.