‘ఇండియా’ గెలిస్తే కులగణన నిర్వహిస్తాం : Rahul Gandhi
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా దేశంలో కులగణనను నిర్వహిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
న్యూఢిల్లీ : 'ఇండియా' కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా దేశంలో కులగణనను నిర్వహిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జనాభాకు అనుగుణంగా ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యాన్ని కల్పించడమే తమ లక్ష్యమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వీలైనంత త్వరగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కల సాకుతో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకాకుండా మరో పదేళ్లు ఆపేందుకు మోడీ సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు.
కుల గణన నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తీసుకొచ్చారని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా గొప్పది. జనాభా లెక్కింపు, డీలిమిటేషన్ అనే సుదీర్ఘ ప్రక్రియలతో ఆ బిల్లుకు మోడీ సర్కారు లింకు పెట్టింది. తద్వారా ఆ బిల్లును వెంటనే అమలు చేయాలనే చిత్తశుద్ధి ఎన్డీయే ప్రభుత్వానికి లేదనే విషయం తేటతెల్లమైంది’’ అని ఆయన చెప్పారు.