క్విట్ కరప్షన్ అని భారత్ నినదిస్తోంది : PM Modi
"కరప్షన్ క్విట్ ఇండియా, డైనస్టీ క్విట్ ఇండియా, అప్పీజ్మెంట్ క్విట్ ఇండియా" నినాదాన్ని యావత్ భారత దేశం ముక్త కంఠంతో వినిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
న్యూఢిల్లీ : "కరప్షన్ క్విట్ ఇండియా, డైనస్టీ క్విట్ ఇండియా, అప్పీజ్మెంట్ క్విట్ ఇండియా" నినాదాన్ని యావత్ భారత దేశం ముక్త కంఠంతో వినిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో అవీనితి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ సారధ్యంలో జరిగిన "క్విట్ ఇండియా" ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ బుధవారం ఒక ట్వీట్ చేశారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. ఆనాడు బ్రిటీష్ వలస పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు. ఇక పార్లమెంట్లో విపక్ష పార్టీల తీరును ఎండగట్టేందుకు బీజేపీ బుధవారం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు.