Jharkhand: ఆ మూడు పార్టీలే అతి పెద్ద శత్రువులు.. హేమంత్ సర్కారుపై మోడీ విమర్శలు

జార్ఖండ్ అధికార పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్‌.. ఈ మూడు పార్టీలే రాష్ట్రానికి అతిపెద్ద శత్రువులని ఆరోపించారు.

Update: 2024-09-15 10:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అధికార పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్‌.. ఈ మూడు పార్టీలే రాష్ట్రానికి అతిపెద్ద శత్రువులని ఆరోపించారు. జెంషెడ్ పూర్ లోని గోపాల్ మైదాన్ లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. జార్ఖండ్‌ను కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అయినందుకు ఆర్జేడీ ఇప్పటికీ ప్రతీకారం కోరుకోంటుందని మండిపడ్డారు. అధికార పార్టీ ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తుందని అన్నారు. వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన జేఎంఎం ఇప్పుడు అదివాసీల అటవీ భూమిని ఆక్రమించిన వారితో జతకట్టారి విమర్శించారు.

కాంగ్రెస్ పై విమర్శలు

ఝార్ఖండ్‌లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాల చొరబాట్లు అతి పెద్ద సవాల్‌గా ఉన్నా.. జేఎంఎం సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దాన్ని అంగీకరించేందుకు ఇష్టపడటంలేదు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు రాష్ట్ర జనాభా సంఖ్యలో మార్పు తెస్తుందని.. ప్రజలు అభద్రతతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌-జేఎంఎం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ నిజాయితీ లేని.. అత్యంత అవినీతి పార్టీ అని మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు, జేఎంఎం ప్రభుత్వం కాంగ్రెస్‌ అవినీతి పాఠశాలలో శిక్షణ తీసుకుందని విమర్శించారు. జేఎంఎం ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో జార్ఖండ్ ని దోచుకోవడం, అవినీతిపైనే దృష్టి సారించిందన్నారు. దోచుకోవడంలో ఏ రంగాన్ని విడిచిపెట్టలేదని ఆరోపించారు. నీరు, అడవులు, భూమి.. ఇలా అన్నింటిలో అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. జార్ఖండ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అవినీతి, అక్రమాలకు సంబంధించిన ‘ఈ కేసులన్నీ’ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. వాగ్దానాలు చేసి, నెరవేర్చే ఏకైక పార్టీ బీజేపీయే అని గుర్తుచేశారు. సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు రాంచీలో రూ.660 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు. ఆరు వందే భారత్‌ రైళ్లకు పచ్చజెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించారు.


Similar News