రానున్న 4-5 రోజుల పాటు దక్షిణ, మధ్య భారతదేశంలో భారీ వర్షాలు: IMD

రుతుపవనాల ప్రభావంతో దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తుండటంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు

Update: 2024-07-16 14:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రుతుపవనాల ప్రభావంతో దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తుండటంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే వర్షాలు మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఐఎండీ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం, దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకుని ఉన్న విదర్భపై అల్పపీడనం కారణంగా రానున్న నాలుగైదు రోజుల పాటు దక్షిణ-మధ్య భారతదేశంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇంకా అండమాన్ & నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌తో సహా తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.


Similar News