ఆప్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు..50 మంది మృతి

ఆప్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 70 మంది మృతి చెందగా.. ఆ విషాదం మరువక ముందే తాజాగా ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా 50 మంది మరణించారు.

Update: 2024-05-11 06:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 70 మంది మృతి చెందగా.. ఆ విషాదం మరువక ముందే తాజాగా ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా 50 మంది మరణించారు. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. అలాగే భారీ ఆస్తి నష్టం సంభవించింది. అకస్మాత్తుగా వచ్చిన వర్షాల వల్ల భారీగా వరదలు సంభవించాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. వరదలతో ఐదు జిల్లాలు ప్రభావితమయ్యాయని వెల్లడించారు. 150 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని వారిని రక్షించేదుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అలాగే వివిధ జిల్లాల్లోని ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయని బాగ్లాన్‌లోని ప్రకృతి విపత్తు నిర్వహణ ప్రాంతీయ డైరెక్టర్ ఎదయతుల్లా హమ్దార్ద్ తెలిపారు. రాజధాని కాబూల్‌ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని ప్రకృతి విపత్తు నిర్వహణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ చెప్పారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌పైనే ప్రధానంగా దృష్టి సారించామని, ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కాగా, గత నెలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ వరదల్లో దాదాపు 2,000 ఇళ్లు, 3 మసీదులు, 4 పాఠశాలలు దెబ్బతిన్నాయి. 

Tags:    

Similar News