ప్లాట్ఫామ్ టికెట్స్.. ప్రైవేట్ హాస్టల్స్.. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు
దిశ, నేషనల్ బ్యూరో: చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు మేలు కలిగేలా జీఎస్టీ పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు మేలు కలిగేలా జీఎస్టీ పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్నులు కట్టేవారికి అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. అనంతరం ఆమె సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాలే ఏకమై తుది నిర్ణయం తీసుకోవాలి’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాలు అభివృద్ధిని కొనసాగించడానికి పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహార బకాయిలను సకాలంలో కేంద్రం చెల్లిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. తాము సూచించిన సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల కాలవ్యవధితో వడ్డీలేని రుణాలను అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
జీఎస్టీ జరిమానాలపై వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదన
వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టబోయే వేతన జీవులు, ఇతరత్రా వర్గాలకు కొన్ని మినహాయింపులు ఇవ్వబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ చెల్లించే చివరితేదీని పొడిగించామని.. దీంతో వర్తకులు, ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందన్నారు. జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితిని పెంచుతామని పేర్కొన్నారు. ‘‘ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ విషయంలో మార్పులు చేస్తాం. అక్రమాలు జరగకుండా ఆధార్ ఆథెంటిఫికేషన్ను తప్పనిసరి చేయాలని నిర్ణయించాం’’ అని ఆర్థిక మంత్రి చెప్పారు. ‘‘జీఎస్టీ జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనలు చేసింది’’ అని ఆమె వెల్లడించారు. ఆగస్టు చివరి వారంలో జీఎస్టీ పాలకమండలి మరోసారి భేటీ అవుతుందన్నారు.
కీలక నిర్ణయాలివీ..
* ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని తీర్మానించారు. అందులో రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు, ప్రయాణికులు బసచేసే గదులు, విశ్రాంతి గదులు, లగేజీ సేవలు, బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలు ఉన్నాయి.
* విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ.20000 వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫార్సు చేసింది.
* అన్ని రకాల సోలార్ కుక్కర్లపై 12 శాతం జీఎస్టీ విధించనున్నారు.
* స్టీల్, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ విధించనున్నారు.
* అన్ని కార్టన్ బాక్సులపై జీఎస్టీ 12 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయంతో యాపిల్, ఇతర పండ్ల వ్యాపారులకు మేలు జరగనుంది.
* స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గించారు.