బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య

మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు.

Update: 2024-07-14 10:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు. 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. మరోవైపు, జస్టిస్ రోహిత్ ఆర్య తీర్పు వెలువరించిన కొన్నింటిపై విమర్శలు వచ్చాయి.

జస్టిస్ రోహిత్ ఆర్య తీర్పుపై విమర్శలు

2021లో ఇండోర్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని, కొవిడ్ ప్రోటోకాల్‌ పాటించలేదని నటులకు జస్టిస్ రోహిత్ ఆర్య బెయిల్ నిరాకరించారు. అయితే, హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఫరూఖీకి బెయిల్ మంజూరు చేసింది. 2020లో మహిళ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తికి జస్టిస్ రోహిత్ ఆర్య బెయిల్ మంజూరు చేశారు. ఆమెకు రాఖీ కట్టాలని, ఆమెకు రక్షణ కల్పించేలా హామీ ఇవ్వాలని షరతు విధించారు. అయితే ఈ తీర్పు వివాదస్పదం కావడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులలో నిందితుల బెయిల్ పిటిషన్ల పరిశీలనపై దిగువ కోర్టులకు పలు సూచనలు చేసింది.


Similar News