ఢిల్లీలో మరోసారి భూకంపం..
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం 4.08 గంటలకు భూకంపం సంభవించింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం 4.08 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. హర్యానాలోని ఫరీదాబాద్కు 9 కిలోమీటర్ల దూరంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీతో పాటు చుట్టుపక్క ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా భూప్రకంపనలను ఫీలయ్యారని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు.
భూప్రకంపనలను గుర్తించిన పలువురు ఢిల్లీవాసులు భయాందోళనకు గురయ్యారు. భవనాల లోపలి నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, అక్టోబరు 3న పొరుగుదేశం నేపాల్లో భారీ భూకంపం సంభవించిన కొన్ని నిమిషాల తర్వాత ఢిల్లీలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇది జరిగి రెండువారాలైనా గడవకముందే మరోసారి హస్తినను భూకంపం వణికించడం గమనార్హం.