Droupadi Murmu: నీటి సంరక్షణకు భారత్ తోడ్పాటు .. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నీటి సంరక్షణ విషయంలో ప్రపంచ ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: నీటి సంరక్షణ విషయంలో ప్రపంచ ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్థిరమైన నీటి వినియోగానికి అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాలను పెంపొందించడానికి నాయకత్వం వహిస్తోందన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8వ ప్రపంచ నీటి వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె ప్రసంగించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. జల్ జీవన్ మిషన్తో అందరికీ పరిశుభ్రమైన నీరు లభిస్తుందని తెలిపారు. నీటి వనరులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఐక్య ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే 78శాతం గ్రామీణ ప్రాంతాలకు నీటి కనెక్షన్లు అందించడం సంతోషంగా ఉందన్నారు. 2024 చివరి నాటికి భారతదేశంలోని 193.06 మిలియన్ల గ్రామీణ గృహాలను నల్లా నీటితో అనుసంధానించడమే మిషన్ లక్ష్యమని తెలిపారు. దాని లక్ష్యాలను సాధించడానికి ప్రజలు సైతం ముందుకు రావాలని తెలిపారు. భాగస్వామ్యం, సహకారం ద్వారా నీటి నిర్వహణ లక్ష్యాన్ని సాధించడానికి సరైన మాధ్యమాన్ని ఎంచుకున్నందుకు జలశక్తి మంత్రిత్వ శాఖను ఆమె అభినందించారు. వర్షాలు అధికంగా కురిసే ప్రాంతాల్లోనూ నీటి కొరత ఉందని, దీనికి కారణం నీటిని నిల్వ చేయకపోవడమేనని నొక్కి చెప్పారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన మంత్రివర్గ ప్లీనరీలో వివిధ దేశాల మంత్రుల మధ్య పరస్పర చర్చలు జరిగాయి.