Doordarshan : 24 గంటల సింధీ భాషా చానల్ ప్రారంభించాలి.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

24 గంటల సింధీ భాషా చానల్ ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.

Update: 2024-10-14 09:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దూరదర్శన్‌లో 24 గంటల సింధీ భాషా చానల్ ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే దీనిని స్వీకరించడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కొట్టి వేసింది. చానల్‌ని ఏర్పాటు చేయాలని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. భాషలో ప్రత్యేక చానల్‌ని కావాలని ఏ పౌరుడు చెప్పలేడని, భాషను రక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సింధీ సంగత్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసి పుచ్చింది.

కాగా, డోగ్రీ, సంతాతీ, బోడో, సంస్కృతం వంటి ఇతర భాషలు ఉన్నపుడు ప్రత్యేక సింధీ చానల్‌కు న్యాయపరమైన ఆదేశాలు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు మే 27న తెలిపింది. డీడీ గిర్నార్, డీడీ రాజస్థాన్, డీడీ సహ్యాద్రిలో సింధీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారని, ఇది ఇప్పటికే అమల్లో ఉందని పేర్కొంది. సింధీ జనాభా ఉన్న ప్రాంతాలను ఇది కవర్ చేస్తుందని వెల్లడించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సింధీ సంగత్ తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. సింధీ భాషను పరిరక్షించడంలోచానల్ ఒక ముఖ్యమైన అంశమని తెలిపారు.

‘సింధీ సంస్కృతి, భాష సక్రమంగా కొనసాగేలా, ప్రచారం చేయబడేలా చూడాలనే ఆలోచన ఉందని, భాషా ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది’ అని చెప్పారు. అయితే, భాషా పరిరక్షణకు ఇతర మార్గాలను అన్వేషించొచ్చని సుప్రీంకోర్టు సూచించింది. ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చట్టం, 1990లోని సెక్షన్ 12(2)(డీ) భారతదేశంలోని విభిన్న భాషలు, సంస్కృతులకు తగినంత కవరేజీని నిర్దేశిస్తుందని, ప్రతి భాషకు ప్రత్యేక చానల్ అవసరం లేదని అభిప్రాయపడింది. 

Similar News