కాలుకు బదులు బాలుడి ప్రైవేట్ పార్టుకు సర్జరీ.. వైద్యుల పనికి తల్లిదండ్రులు షాక్

కాలుకు ఆపరేషన్ కోసం వస్తే బాలుడి ప్రైవేట్ పార్టుకు సర్జరీ చేసిన ఘటన దుమారంగా మారింది.

Update: 2024-06-29 13:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాలుకు ఆపరేషన్ కోసం వస్తే వైద్యులు బాలుడి ప్రైవేటు పార్టుకు సర్జరీ చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. విషయం గమనించి ప్రశ్నించినందుకు ఆ వైద్యులు మరొకొత్త నాటకానికి తెరలేపడం చర్చగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా కాలికి గాయం అయింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు షాహాపూర్ లోని ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్ రే తీసి, రిపోర్టులను పరిశీలించిన తర్వాత కాలుకు ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. దాంతో బాలుడిని అతడి తల్లిదండ్రులు జూన్ 15న ఆసుపత్రిలో చేర్పించారు. ఆపరేషన్ పూర్తయి బాలుడిని మరో రూమ్ లోకి తీసుకు వచ్చాక తమ బాలుడికి ఆపరేషన్ జరగాల్సిన కాలుకు ఎలాంటి గాయం లేకపోగా ప్రైవేట్ పార్టు వద్ద సర్జరీ జరిగినట్లు గమనించారు.

దీంతో ఆందోళన చెందిన బాలుడి పేరెంట్స్ వెంటనే వైద్యులను ప్రశ్నించారు. దాంతో హుటాహుటీన మళ్లీ బాలుడిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్లి అప్పుడు కాలుకు సర్జరీ చేశారని బాలుడి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం మరోలా చెబుతున్నారు. బాలుడి మూత్రనాళ సమస్య ఉందని అందువల్ల రెండు చోట్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని షాహాపూర్‌ ఆస్పత్రి డీన్‌ డాక్టర్‌ షిండే తెలిపారు. కాగా సదరు బాలుడికి ఆపరేషన్ జరిగిన రోజే దాదాపు ఒకే వయసులో ఉన్న మరో ఇద్దరు పిల్లలకు మూత్రనాళ శస్త్రచికిత్సల కోసం షెడ్యూల్ చేయబడిందని వారి ఆపరేషన్లు పూర్తయిన తర్వాత తమ బాలుడిని కూడా తీసుకువెళ్లి ప్రైవేట్ పార్టుకే సర్జరీ చేశారని బాలుడి బంధువులు తెలిపారు. కాగా డాక్టర్ల నిర్వాకం ఇప్పుడు చర్చగా మారింది.

Tags:    

Similar News