Delhi: ఢిల్లీ సీఆర్‌పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు ఘటనలో అనుమానాస్పద 'వైట్ పౌడర్'

పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించడంతో దుండగులు బాంబును ఉపయోగించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Update: 2024-10-20 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ప్రశాంత్ విహార్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఈ ఘటన జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రమాదంలో పాఠశాల గోడలు ద్వంశం కాగా, దగ్గరలో ఉన్న వాహనాల అద్దాలు కూడా పగిలినట్టు స్థానికులు వెల్లడించారు. స్కూల్ గోడతో పాటు సమీప ప్రాంతమంతా పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించడంతో దుండగులు బాంబును ఉపయోగించి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పేలుడు జరిగిన విధానాన్ని బట్టి బెదిరించేందుకే ఇందుకు పాల్పడ్డారని, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. బాంబుల తయారీలో ఉపయోగించే అనుమానాస్పద 'వైట్ పౌడర్' గుర్తించామని, దాన్ని పరీక్షించాలని, అందులో అమ్మోనియం నైట్రేట్, క్లొరైడ్ మిశ్రమం ఉండవచ్చని తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీనిపై స్పష్టత ఇవ్వగలమన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఎన్ఎస్‌జీకి చెందిన నిపుణులు పేలుడు పదార్థాల నమూనాలను సేకరించారు. పేలుడు జరిగిన ప్రదేశంలో వైర్లు, బ్యాటరీని గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, పేలుడు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు మొబైల్ నెట్‌వర్క్ డేటాను సేకరిస్తున్నాం. దగ్గరలోని ఎల్‌పీజీ సిలిండర్‌ పేలిపోయిందని భావిస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 

Tags:    

Similar News