Isha Foundation: మరో వివాదంలో ఇషా ఫౌండేషన్

ఇషా హోమ్ స్కూల్ (ఐఎస్‌హెచ్)లో మరో బాలుడు తమ కుమారుడిని మూడేళ్లపాటు లైంగికంగా వేధించాడన్నారు.

Update: 2024-10-20 17:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే ఇద్దరు మహిళలను అక్రమంగా నిర్భంధించిన ఆరోపణలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందింది. తాజాగా అమెరికా నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  జంట ఇషా ఫౌండేషన్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు ఎలాంటి వ్యవస్థకు కట్టుబడి ఉండకుండా ఏకపక్షంగా నడుస్తున్నాయని అమెరికా నుంచి తిరిగి వచ్చిన సత్య నరేంద్ర రాగాని, యామిని రాగాని దంపతులు ఆరోపించారు. ఇషా హోమ్ స్కూల్ (ఐఎస్‌హెచ్)లో మరో బాలుడు తమ కుమారుడిని మూడేళ్లపాటు లైంగికంగా వేధించాడని, ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా ఎలాంటి స్పందన రాలేదన్నారు. అదే పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలికపై ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం గురించి కూడా ఈ జంట వివరించింది. సత్య నరేంద్ర, యామిని దంపతులు పదేళ్లకు పైగా ఇషా ఫౌండేషన్‌లో కమిటీ సభ్యులుగా ఉన్నారు. వారు అమెరికా వెళ్లే సమయంలో కుమారుడిని ఇషా ఫౌండేషన్‌కు చెందిన హోమ్ స్కూల్‌లో చేర్చారు. ఈ మధ్య తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత తమ కుమారుడిపై జరిగిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా సంక్షేమం ముసుగులో ఇషా ఫౌండేషన్ చేస్తున్న దౌర్జన్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News