Puja Khedkar: వివాదాస్పద ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్‌కు షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు

కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ వేసిన ఆమె పిటిషన్‌ను పాటియాలా హౌస్ కోర్టు గురువారం కొట్టివేసింది.

Update: 2024-08-01 15:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు మోసపూరిత మార్గాలను అనుసరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ వేసిన ఆమె పిటిషన్‌ను పాటియాలా హౌస్ కోర్టు గురువారం కొట్టివేసింది. యూపీఎస్‌సీ పరీక్షలకు ఎక్కువసార్లు హాజరవడానికి నకిలీ ఐడెంటిటీ ఉపయోగించినట్టు తనపై నమోదైన కేసులో పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. అయితే, అందుకు కోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో దర్యాప్తు సంస్థ, ఢిల్లీ పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొంది. నకిలీ పత్రాలకు సంబంధించి యూపీఎస్‌సీ నుంచి ఆమెకు సహాయం అందించారా? అనే కోణంలో విచారణ నిర్వహించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశాలిచ్చింది. పూజా ఖేడ్కర్ కాకుండా ఇంకెవరైనా యూపీఎస్‌సీ అభ్యర్థులు నకిలీ పత్రాలతో ప్రయోజనం పొందారా అనే అంశంపై కూడా దర్యాప్తు చేపట్టాలని సూచించింది. ట్రైనీ ఐఏఎస్‌గా పూణెలో బాధ్యతలు నిర్వహిస్తున్న పూజా ఖేడ్కర్‌పై నకిలీ అఫిడవిట్, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దర్యాప్తు అనంతరం యూపీఎస్‌సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులోనూ యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరు కాకుండా జీవితకాల నిషేధం విధించింది. నకిలీ పత్రాల వ్యవహారంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News