Nitin Gadkari : ప్రధాని పోస్టుపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-14 19:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడితే మద్దతిస్తానని ఓ రాజకీయ నాయకుడు తనతో చెప్పాడని.. అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని గడ్కరీ చెప్పుకొచ్చారు. ఎందుకంటే దేశ ప్రధాని కావాలనేది తన లక్ష్యం కానే కాదని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పం ఒక్కటే తనకు ఉందని, కేవలం ఆ దిశగానే ముందుకు సాగుతానని ఆయన తేల్చి చెప్పారు. పదవుల కోసం ఆశపడి ఆశయాలను ఫణంగా పెట్టే పనిని తాను చేయబోనని గడ్కరీ పేర్కొన్నారు. శనివారం నాగ్‌పూర్‌లో జరిగిన జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీపీఐ దివంగత దిగ్గజ నేత ఏబీ బర్ధన్‌ను ఈసందర్భంగా గడ్కరీ గుర్తు చేసుకున్నారు.

నాగ్‌పూర్, విదర్భ ప్రాంతం నుంచి అత్యున్నత రాజకీయ నాయకుడిగా బర్ధన్ ఎదిగారని తెలిపారు. ఏబీ బర్ధన్ చాలా నిజాయితీగా కమ్యూనిస్టు పార్టీ తరఫున కడదాకా పోరాడారు. అలాంటి నిజాయితీపరులైన ప్రతిపక్ష నేతలను గౌరవించాల్సిన బాధ్యత అధికారపక్షంలోని తమపై ఉంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. నిజాయితీ లేని ప్రతిపక్ష నేతలకు గౌరవం పొందే అర్హత ఉండదన్నారు. న్యాయ వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, శాసనవ్యవస్థ, మీడియా అనే నాలుగు స్తంభాలు నైతికతతో పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని గడ్కరీ తెలిపారు.


Similar News