దేశంలో రైలు ప్రమాదాలు సాధారణమైనాయి.. కేంద్రంపై 'ఎక్స్' వేదికగా ప్రియాంక ఫైర్

తమిళనాడులో గత రాత్రి చోటుచేసుకున్న మైసూర్-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు.

Update: 2024-10-12 10:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో గత రాత్రి చోటుచేసుకున్న మైసూర్-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రియాంక గాంధీ ఆసక్తికర పోస్ట్ చేశారు. దేశంలో రైలు ప్రమాదాలు చాలా సాధారణమైపోయాయని కేంద్రంపై ఫైర్ అయ్యారు. రైలు ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం జవాబుదారీతనం లేదా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

దేశంలోని కోట్లాది మంది సామాన్యులు భయంభయంగా రైళ్లలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సురక్షితమైన రైలు ప్రయాణానికి భరోసా కల్పించే బాధ్యత విషయంలో ప్రభుత్వం వెనుదిరిగిందని విమర్శించారు. నెలల తరబడి సాగుతున్న ఈ ఘటనలు ఎప్పుడు ఆగుతాయో? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాగా, త‌మిళ‌నాడులోని చెన్నై శివారులో శుక్ర‌వారం రాత్రి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెండు బోగీలు ద‌గ్ధ‌మ‌య్యాయి. మంట‌లు చెల‌రేగ‌డంతో ప‌లువురు ప్ర‌యాణికులు గాయ‌ప‌డిన‌ట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రాణ నష్టం జరగలేదని, 19 మందికి గాయాలు అయ్యాయని ప్రకటించారు. కాగా, ప్రమాద సమయంలో రైలులో 1360 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి.


Similar News