పదేళ్లలో 50 శాతం మహిళా సీఎంలే మా లక్ష్యం : Rahul Gandhi

Update: 2023-12-01 16:52 GMT

తిరువనంతపురం : వచ్చే పదేళ్లలో తాము పాలించే రాష్ట్రాల్లో 50 శాతం మహిళా ముఖ్యమంత్రులకు అవకాశమివ్వడమే లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలు, లక్షణాలు కలిగిన ఎంతోమంది మహిళా నాయకులు పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు. కేరళలోని కొచ్చిలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉత్సా‌హ్’ సదస్సును రాహుల్ గాంధీ ప్రారంభించారు.

అనంతరం ప్రసంగిస్తూ.. “ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేరు. కానీ పార్టీలో చాలామంది మహిళలకు ముఖ్యమంత్రి పదవిని పొందే స్థాయి ఉందని నాకు తెలుసు’’ అని ఆయన చెప్పారు. ‘‘ఆర్ఎస్ఎస్ పురుష ఆధిపత్య సంస్థ. మహిళలకు అవకాశాలు ఇవ్వడాన్ని అది అంగీకరించదు. ఆర్ఎస్ఎస్‌లో ఎన్నడూ మహిళలకు పదవులను కేటాయించలేదు. మహిళలకు ఓపిక ఎక్కువ. దూర దృష్టి ఎక్కువ. అందుకే అధికార నిర్మాణంలో వాళ్లు తప్పకుండా భాగం కావాలి’’అని రాహుల్ తెలిపారు.


Similar News