కుప్పకూలిన భవనం..9 మంది సజీవ సమాధి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 9 మంది సజీవ సమాధి అయ్యారు.
దిశ వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 9 మంది సజీవ సమాధి అయ్యారు. మీరట్లోని జాకీర్ కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది చనిపోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యాయి. అయితే వర్షం కురుస్తుండటం కొంత సహాయ చర్యలకు ఇబ్బందిగా మారింది. శిథిలాల కింద 14 మంది చిక్కుకుపోయారని జిల్లా కలెక్టర్ దీపక్ మీనా వెల్లడించారు. వారిలో ఎనిమిది మందిని రక్షించామన్నారు. శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా సహాయక చర్యలు కొనసాగుతున్నకొద్ది మృతుల సంఖ్య పెరిగె అవకాశముందని భావిస్తున్నారు.