'ఫొటోలు పెట్టొద్దు.. రీల్స్ చేయొద్దు'.. భద్రతా బలగాలకు కీలక ఆదేశాలు
భద్రతా బలగాలపై పాకిస్తాన్ హనీ ట్రాపింగ్ ఉదంతాల నేపథ్యంలో కేంద్ర పోలీసు బలగాలు అలర్ట్ అయ్యాయి.
న్యూఢిల్లీ : భద్రతా బలగాలపై పాకిస్తాన్ హనీ ట్రాపింగ్ ఉదంతాల నేపథ్యంలో కేంద్ర పోలీసు బలగాలు అలర్ట్ అయ్యాయి. ఆన్లైన్ ఫ్రెండ్ షిప్ల జోలికి వెళ్లొద్దని, సోషల్ మీడియాలో రీల్స్ వంటివి చేయొద్దని పేర్కొంటూ తమ సిబ్బందికి ఆదేశాలను జారీ చేశాయి. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీపీబీలలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది యూనిఫామ్లో తమ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు ఇటీవల గుర్తించాయి. ఇంకొందరు సున్నితమైన లొకేషన్లలో దిగిన ఫొటోలను షేర్ చేయడంతో పాటు ఆన్లైన్లో స్నేహితుల కోసం రిక్వెస్ట్లు పంపుతున్నారని ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది.
దీనిపై నిఘా వర్గాల నుంచి నివేదిక అందడంతో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీపీబీ అప్రమత్తమయ్యాయి. యూనిఫామ్లో ఉన్న వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని, గుర్తుతెలియని వ్యక్తులతో ఆన్లైన్లో ఫ్రెండ్ షిప్ చేయొద్దని తమ సిబ్బందికి ఆర్డర్ ఇచ్చాయి. ఈ గైడ్ లైన్స్ ను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించాయి. ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోఢా కూడా తమ బలగాలకు ఈమేరకు వార్నింగ్ ఇచ్చారు.