ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. ఈడీ అధికారిపై సీబీఐ కేసు

ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌ ఖత్రిపై సీబీఐ కేసు నమోదైంది.

Update: 2023-08-28 16:48 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌ ఖత్రిపై సీబీఐ కేసు నమోదైంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, వ్యాపారవేత్త అమన్‌దీప్‌ సింగ్‌ ధాల్‌‌లను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది. అయితే అమన్‌దీప్‌ అరెస్టుకు ముందు.. అతడికి అనుకూలంగా వ్యవహరించేందుకు పవన్‌ ఖత్రి, ఈడీ క్లర్క్‌ నితేశ్‌ హోకర్‌లు రూ.5 కోట్ల లంచం పుచ్చుకున్నారని ఈడీ ఆరోపించింది. 2022 డిసెంబరు నుంచి 2023 జనవరి మధ్య కాలంలో తాము ప్రవీణ్ అనే సీఏకు రూ.5 కోట్ల లంచం ఇచ్చామని అమన్‌దీప్‌, ఆయన తండ్రి బీరేందర్‌ పాల్‌ ఈడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్రవీణ్ తనకున్న పరిచయాలతో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌ ఖత్రి, క్లర్క్‌ నితేశ్‌ హోకర్‌లతో మాట్లాడి.. దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించేలా ఒప్పందం కుదురుస్తానని చెప్పారని కంప్లైంట్‌లో ఆరోపించారు. ఈ విషయాన్ని ఆగస్టు 7న సీబీఐ దృష్టికి ఈడీ తీసుకెళ్లింది. సీఏ ప్రవీణ్, ఎయిరిండియా ఉద్యోగి దీపక్‌ సంగ్వాన్‌లు అమన్‌దీప్‌ నుంచి రూ.5 కోట్లు తీసుకున్నట్లు పేర్కొంది. 5 కోట్లలో రూ.50 లక్షలను పవన్‌ ఖత్రి, దీపక్‌ సంగ్వాన్‌లకు ఇచ్చానని సీఏ ప్రవీణ్ దర్యాప్తులో ఒప్పుకున్నాడని చెప్పింది. ఈ వ్యవహారంలో క్లారిడ్జెస్‌ హోటల్స్‌ సీఈవో విక్రమాదిత్య, అమన్‌దీప్ సింగ్ ధాల్, బీరేందర్ పాల్ సింగ్ పైనా సీబీఐ కేసు ఫైల్‌ చేసింది.


Similar News