NEET PG Exam : నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయలేం : సుప్రీంకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో : ఆదివారం రోజు(ఆగస్టు 11న) జరగాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Update: 2024-08-09 12:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఆదివారం రోజు(ఆగస్టు 11న) జరగాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాదాపు 2 లక్షల మంది అభ్యర్థుల కెరీర్‌ను తాము పణంగా పెట్టలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు వెలుగులోకి రావడంతో అంతకుముందు జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈనెల 11న ఆ పరీక్ష జరగబోతోంది. అయితే నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే చాలామంది అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లు దూరంగా పడ్డాయని, వాటిని చేరుకోవడం కష్టతరంగా ఉంటుందని పేర్కొంటూ ఓ పిటిషన్ దాఖలైంది.

పరీక్షకు 2 రోజుల ముందు ఆ నిర్ణయం తీసుకోలేం

‘‘ఆగస్టు 11న పరీక్ష జరుగుతుందనే సమాచారం మాకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) నుంచి జులై 31నే అందింది. పరీక్షా కేంద్రం వివరాలను ఆగస్టు 8న తెలిపారు’’ అని పిటిషన్‌లో పలువురు అభ్యర్థులు ప్రస్తావించారు. అతి తక్కువ వ్యవధిలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం అసౌకర్యంగా ఉంటుందని పేర్కొన్న పిటిషనర్లు, తమ లాంటి అభ్యర్థుల సౌకర్యార్ధం పరీక్ష తేదీని మార్చాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే న్యాయమూర్తులు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జేబీ పర్దీవాలాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. పరీక్ష జరగడానికి కేవలం 2 రోజుల ముందు అలాంటి నిర్ణయాన్ని తాము తీసుకోలేమని తేల్చి చెప్పింది. అతికొద్దిమంది పిటిషనర్ల కోసం 2 లక్షల మంది కెరీర్‌ను పణంగా పెట్టలేమని ధర్మాసనం స్పష్టంచేసింది.

Tags:    

Similar News