Brics: బ్రిక్స్‌లో భారత్‌దే కీలక పాత్ర.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

బ్రిక్స్‌కు భారత్ ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.

Update: 2024-10-21 15:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిక్స్‌కు భారత్ ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధి, వంటి రంగాల్లో సంస్కరణలు రూపొందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో మిస్రీ సోమవారం మీడియాతో మాట్లాడారు. బ్రిక్స్ కార్యకలాపాలకు భారత్ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుందని నొక్కి చెప్పారు. అనేక రకాల ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా బ్రిక్స్ ముఖ్యమైన వేదికగా దోహదపడుతుందని తెలిపారు. అంతర్జాతీయ క్రమాన్ని రూపొందిచడంలోనూ సహాయపడుతుందని వెల్లడించారు. బ్రిక్స్ ప్రతినిధులు కజాన్ డిక్లరేషన్‌ను కూడా స్వీకరించాలని భావిస్తున్నారని, ఇది బ్రిక్స్‌కు మార్గం చూపుతుందని తెలిపారు.

కాగా, బ్రిక్స్16వ శిఖరాగ్ర సదస్సు రష్యాలోని కజాన్‌లో అక్టోబర్ 22 నుంచి 24 వరకు జరగనుంది. ఈ సమావేశంలో భారత్ తరఫున ప్రధాని మోడీ పాల్గొననున్నారు. సదస్సు అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో వివాదంపై ఇరువురు నేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు బ్రిక్స్ లో సభ్యత్వ దేశాలుగా ఉండగా.. ఈ ఏడాది ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈలతో సహా పలు కొత్త సభ్యులు చేరారు. ఈ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ అభివృద్ధి, భద్రతను ప్రోత్సహించడం శిఖరాగ్ర సమావేశం ప్రధాన లక్ష్యంగా ఉంది. 


Similar News