ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్ 2019లో గెలిచిన నాలుగు సీట్ల కంటే గణనీయంగా మెరుగుపడి ఎనిమిది స్థానాల్లో ఆధిక్యం

Update: 2024-06-04 17:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అన్ని చోట్లా భిన్నంగానే ఉంది. సొంతంగా 370 సీట్లను గెలుస్తామన్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను చేరకపోగా ప్రభుత్వం ఏర్పాటు కోసం భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఈశాన్య రాష్ట్రాల్లోనూ పట్టును కోల్పోయింది. ఈ రాష్ట్రాల్లో సిక్కింతో సహా 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 12 చోట్ల మాత్రమే ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షాలు మూడింటిలో ఆధిక్యతను కలిగి ఉన్నాయి. దీంతో ఎన్డీఏ బలం 15కి తగ్గింది. 2019లో ఎన్డీఏ 19 స్థానాలను దక్కించుకుంది. దీనికి విరుద్ధంగా, కాంగ్రెస్ 2019లో గెలిచిన నాలుగు సీట్ల కంటే గణనీయంగా మెరుగుపడి ఎనిమిది స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో పునరుజ్జీవనాన్ని పొందే ప్రయత్నం చేస్తోంది. దీనికి అదనంగా ప్రాంతీయ పార్టీలు ఈసారి ఎన్నికల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగాయి. ఈ ప్రాంతంలో అత్యధికంగా 14 లోక్‌సభ స్థానాలు ఉన్న అస్సాంలో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. కరింగంజ్‌లో ఆధిక్యంతో కొనసాగుతోంది. దాని మిత్రపక్షాలు అసోమ్ గణ పరిషత్(ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్), మరో రెండు స్థానాల్లో ముందున్నాయి. అస్సాంలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం.. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) పూర్తిగా ఓటమిని ఎదుర్కోవడం. దాని కీలకనేత బద్రుద్దీన్ అజ్మల్, ధుబ్రీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాకీబుల్ హుస్సెన్ కంటే అత్యధికంగా 10 లక్షల ఓట్ల కంటే ఎక్కువ వెనుకంజలో ఉన్నారు. సిక్కింలోని ఒకే ఒక సీటు సిక్కిం-1ను సిక్కిం క్రాంతికారి మోర్చా అభ్యర్థి ఇంద్ర హంగ్ సుబ్బా 80,830 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

మేఘాలయలోని రెండు సీట్లలో షిల్లాంగ్-1లో వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీ నుంచి డా. రిక్కీ ఆండ్రూ జె సింకాన్ 3.71 లక్షల్ ఓట్ల తేడాతో గెలుపొందారు. తురా-2లో కాంగ్రెస్ అభ్యర్థి సెలెన్ ఎ సంగ్మా 1.55 లక్షల కోట్లతో గెలిచారు.

మిజోరాంలోని మిజోరాం-1 నుంచి జోరం పీపుల్స్ మూమెంట్ నుంచి రిచర్డ్ వాన్‌లాల్‌మాంగ్యా 68,288 ఓట్లతో విజయం దక్కించుకున్నారు. నాగాలాండ్‌లోని ఒకే ఒక సీటు నాగాలాండ్-1 నుంచి కాంగ్రెస్ అభ్యర్థి 50 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.

ఇక, త్రిపురలో రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ ఇక్కడ పట్టు సాధించింది. త్రిపుర పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ గెలుపొందగా, త్రిపుర తూర్పులో కిరీట్ ప్రద్యోత్ దేబ్ బర్మన్ విజయం సాధించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ రెండు సీట్లను దక్కించుకుంది. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు అరుణాచల్ వెస్ట్‌లో సునాయాసంగా, అరుణచల్ ఈస్ట్‌లో తపిర్ గావ్ గెలిపొందారు.

తరుచూ అశాంతితో సతమతమవుతున్న మణిపూర్‌లో రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. జేఎన్‌యూ ప్రొఫెసర్ అంగోమ్‌చా బిమోల్ అకోయిజం ఇన్నర్ మణిపూర్‌లో లక్ష ఓట్లతో, ఆల్‌ఫ్రెడ్ కన్ంగమ్ ఎస్ ఆర్థర్ ఔటర్ మణిపూర్‌లో 85,418 ఓట్లతో నెగ్గారు.

బీజేపీ ఓటమికి కారణాలు..

* ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టు కోల్పోవడానికి మణిపూర్ కీలక కారణం. ఈ రాష్ట్రంలో చెలరేగిన హింసను కప్పి వేసేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేయడం, మహిళలపై జరిగిన దాడులు సహా అనేక అంశాలు ఓటమికి దోహదం చేశాయి.

* బీజేపీకి చెందిన మూడు ప్రాంతీయ మిత్రపక్షాలు తమ తమ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. ఎన్‌పీపీ, ఎన్‌డీపీపీలు మేఘాలయ, నాగాలాండ్‌లలో బీజేపీ పొత్తు కలిగి ఉంది. ఎన్‌పీపీకి కంచుకోటగా భావించే తురాలో ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సోదరి, సిట్టింగ్ ఎంపీ అగాథా సంగ్మా కాంగ్రెస్ అభ్యర్థి సలెంగ్ సంగ్మా చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరో ఎన్డీఏ మిత్రపక్షం ఎన్‌పీఎఫ్ కూడా మణిపూర్ ఔటర్ సీటును నిలుపుకోవడంలో విఫలమైంది. అస్సాంలోని బీజేపీకి మిత్రపక్షమైన ఏజీపీ పరిస్థితి కూడా అంతే. 


Similar News