Siddique: సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడు మైనర్ కాదు.. బోన్ అసిఫికేషన్ టెస్టులో వెల్లడి

మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య కేసులో నిందితుడు మైనర్ కాదని తేలింది.

Update: 2024-10-14 06:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య కేసులో నిందితుడు మైనర్ కాదని తేలింది. ఈ కేసులో నిందితులైన హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్, యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కేసు విచారణ సందర్భంగా నిందితుల్లో ఒకరైన ధర్మరాజ్ కశ్యప్ తాను మైనర్ నని ముంబై కోర్టుకు తెలిపాడు. నిందితుడి వద్ద సరైన సర్టిఫికేట్లు లేకపోవడంతో అతడు చెప్పేది నిజమో, కాదో తెలుసుకునేందుకు బోన్‌ అసిఫికేషన్‌(bone ossification) టెస్టు చేయాలని కోర్టు పోలీసులకు సూచించింది. అయితే, ఆ రిపోర్టుల్లో ధర్మరాజ్ కశ్యప్ మైనర్ కాదని తేలడంతో కోర్టు అతడ్ని పోలీసు కస్టడీకి అప్పగించింది. నిందితులకు అక్టోబర్ 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది.

మరో వ్యక్తి అరెస్టు

కాగా, నిందితులకు ఆశ్రయం ఇచ్చిన పూణేకు చెందిన ప్రవీణ్ లోంకర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఈ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌నే కారణమని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన శిబు లోంకర్‌కు సోదరుడని వెల్లడించారు. శిబు లోంకర్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ధర్మరాజ్ కశ్యప్, కర్నైల్ సింగ్ లతో ఉన్న మరో షూటర్ శివ కుమార్ అలియాస్ శివ గౌతమ్ పరారీలో ఉన్నాడు. ఈ హత్య వెనుక ఉన్న స్టర్ మైండ్ మహ్మద్ జీషాన్ అక్తర్ (21) అని పోలీసులు గుర్తించారు. అతడి ఆచూకీ కూడా తెలియాల్సి ఉంది. శనివారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. బాబా సిద్ధిఖీపై పలువురు దుండగులు అతడిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. సిద్ధిఖీకి ముంబై బ్లాస్టింగ్స్ సూత్రధారి, భారత మోస్ట్‌వాంటెడ్‌ దావూద్‌ ఇబ్రహీం (Dawood Ibrahim)తో సంబంధాలు ఉండటం, తమ టార్గెట్‌ అయిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు అతడు స్నేహితుడు అవడం వంటి కారణాల వల్లే అతడిని హత్య చేశామని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Similar News