Delhi : దేశ రాజధానిలో తుపాకుల మోత! బౌన్సర్లను మోకాళ్లపై కూర్చోబెట్టి గాల్లోకి ఫైరింగ్

దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్లబ్ వద్ద ఆయుధాలతో గాల్లోకి కాల్పులు జరుపుతూ దుండగులు వీరంగం సృష్టించారు.

Update: 2024-09-08 08:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్లబ్ వద్ద ఆయుధాలతో గాల్లోకి కాల్పులు జరుపుతూ దుండగులు వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫూటేజీ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో కాన్చ్ అనే క్లబ్‌కు దాదాపు నలుగురు దుండగులు ఆయుధాలతో వచ్చినట్లు సీసీ కెమెరాల్లో కనిపిస్తుంది. 'మోకాళ్లపై కూర్చోండి.. లేకపోతే పేల్చివేస్తాను' అని క్లబ్ బయట ఒక లేడీ బౌన్సర్‌తో సహా ముగ్గురు బౌన్సర్లపై గన్ తీసి దుండగులు బెదిరింపునకు దిగుతారు. దాదాపు అరడజను పైగా దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు.

తర్వాత ఇద్దరు దుండగులు క్లబ్‌లోకి వెళ్తారు. ఈ క్రమంలోనే బయట ఉన్న దుండగులు బౌన్సర్లను కింద కూర్చోవాలని బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతారు. అయితే గాలిలో కాల్పులు జరగడంతో ఎవరికీ బుల్లెట్ తగలలేదు. క్లబ్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే ఈ కాల్పుల ఉద్దేశమని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఆయధ చట్టం కింద కేసు నమోదు చేశారు. కాల్పులు జరిపిన వారిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Similar News